
పెహల్గామ్ దాడి తర్వాత పర్యాటక ప్రాంతాలతో పాటు.. ప్రముఖ యాత్రా స్థలాల్లోనూ భారత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా చార్దామ్ యాత్ర నేపధ్యంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు. చార్ దామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రిల యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమైంది. కేదార్నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరవ నున్నారు. ఈ యాత్ర ఆరు నెలలు అంటే అక్టోబర్- నవంబర్ వరకు కొనసాగుతుంది.
పహల్గామ్ ఘటన తర్వాత, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ సమన్వయంతో చార్ ధామ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. కీలక ప్రదేశాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల చుట్టూ భద్రతను పెంచారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ , ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, రాష్ట్ర పోలీసులతో సహా వేలాది మంది సిబ్బందిని మోహరించారు. ఆలయాలకు వెళ్లే మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో అధిక-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలు 24/7 నిఘా కోసం కంట్రోల్ రూమ్లతో అనుసంధానించారు. హిమాలయ ప్రాంతంలోని క్లిష్టమైన మార్గాల్లో డ్రోన్లతో నిఘా నిర్వహిస్తున్నారు.
ఈసారి యాత్రికుల భద్రత కోసం ఫోటోమెట్రిక్, బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డ్ ఆధారిత రిజిస్ట్రేషన్ను అమలు చేస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రతి ఆలయం సమీపంలో వైద్య సిబ్బంది, అగ్నిమాపక బృందాలతో కూడిన రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ రెస్క్యూ సేవలు అందుబాటులో ఉన్నాయి. చార్ ధామ్ యాత్ర మార్గాల్లోని రిషికేశ్, హరిద్వార్, గర్వాల్, ఉత్తరకాశీ వంటి ప్రాంతాలు హై అలర్ట్ సైరన్ మోగింది. ఈ ప్రాంతాల్లో పోలీసు గస్తీని పెంచారు. యాత్రికుల బస్సులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు.
మరిన్ని కోసం ఇక్కడ క్లిక్ చేయండి..