భారత్ రక్షణ శాఖ వెబ్‌సైట్లపై పాక్ సైబర్ దాడి..

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. భారత్ చర్యలతో లోలోపల వణికిపోతుంది. తమకు అలవాటైన దొడ్డి దార్ల గుండా భారత్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా పాకిస్తాన్ హ్యాకర్లు భారత రక్షణ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. రక్షణ సిబ్బందికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని, వారి లాగిన్‌లు.. టార్గెట్‌గా పాక్  సంబంధిత గ్రూపులు సైబర్ దాడి చేసినట్లు తెలుస్తోంది.

మన మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌కు సంబంధించిన సున్నితమైన డేటాను హ్యాకర్లు పొందినట్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ కు చెందిన X హ్యాండిల్‌లో పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్  చేయడానికి ప్రయత్నించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. హ్యాకింగ్ ప్రయత్నం వల్ల ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది అంచనా వేయడానికి ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను పూర్తి ఆడిట్ కోసం ఆఫ్‌లైన్‌లో ఉంచినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న సంస్థలు లేదా వ్యక్తులు స్పాన్సర్ చేసే సైబర్ దాడులను గుర్తించడానికి.. ఎక్స్‌పర్ట్స్ సైబర్‌స్పేస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. ఇతర హ్యాకింగ్ ప్రయత్నాల నుండి రక్షణ కల్పించడానికి భద్రతను బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ఎక్స్ హ్యాండిల్‌లో ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన ఒక వెబ్‌పేజీ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో, ఒక భారతీయ ట్యాంక్ స్థానంలో ఒక పాకిస్తాన్ ట్యాంక్ ఉంది. మరొక పోస్ట్‌లో భారత రక్షణ సిబ్బంది పేర్ల లిస్ట్ ఉంది. “హ్యాక్ అయింది. మీ భద్రత అనేది ఒక భ్రమ. MES డేటా వారి సొంతం” అనే సందేశం ఉంది. మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ వెబ్‌సైట్‌లోని 1,600 మంది వినియోగదారుల 10 GB కంటే ఎక్కువ డేటాను యాక్సెస్ చేసినట్లు ఆ హ్యాండిల్ పేర్కొంది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీరీని దారుణంగా కాల్చి చంపిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దారుణమైన దాడికి బాధ్యత వహించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.